Saturday, March 8, 2014

సీమాంధ్రని స్వర్ణాంధ్రగా మార్చాలంటే ఏం చేయాలి?

                                 
                                      గతం గత: గతం నుండి పాఠాలు నేర్చుకుని, వర్తమాన పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరించి భవిష్యత్ ప్రణాళికలు సిద్దం చేసుకోవడమే వివేకవంతుల లక్షణం. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఒక ప్రాంత ప్రజలకు మోదాన్ని, మరో ప్రాంత ప్రజలకు ఖేదాన్ని మిగిల్చిందనేది వాస్తవం. ఈ సమయంలో సీమాంధ్ర ప్రాంతాలతో ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం ఏర్పాటు కాబోతుంది. మరి మన సీమాంధ్ర ప్రాంతాన్ని స్వర్ణాంధ్ర గా మలుచుకోవాలంటే ఏం చేయాలో తెలియజేసే నా ముఖ్యమైన సూచనలు.


                            


--అన్ని పెట్టుబడులు, కార్యాలయాలు, మౌలిక వసతులు ఒకే చోట కేంద్రికృతం కాకుండా చూడాలి. హైదరాబాదు విషయంలో చేసిన పొరపాట్లు మరలా చేయకూడదు.

-- కొత్తగా ఏర్పాటుకాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ప్రత్యేక ప్రతిపత్తి హోదాని పదేళ్ళకు పొడిగించేలా ఎన్నికల తరువాత వచ్చే కొత్త ప్రభుత్వం కృషి చేయాలి.

-- రాజధాని విషయంలో వైషమ్యాలు సృష్టించే రాజకీయ నాయకులతో అప్రమత్తంగా ఉండాలి. రాజధాని కేవలం పరిపాలనా వ్యవహారాలకు మాత్రమే కేంద్రంగా ఉండేలా చూడాలి.
ఉదాహరణ: గాంధీ నగర్ (గుజరాత్), కాన్ బెర్ర (ఆస్ట్రేలియా)

-- గుజరాత్ తరువాత భారతదేశంలో అత్యధిక తీర ప్రాంతం(972 కి.మి) ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్.

-- గంగవరం, కృష్ణ పట్నం, దుగ్గరాజపట్నం, కాకినాడ, నిజాం పట్నం, మచిలీపట్నం నౌకాయాన కేంద్రాలను( పోర్ట్స్) విశాఖపట్నం తరహాలో భారీ నౌకాయాన కేంద్రాలుగా, సరకు ఎగుమతి దిగుమతులకు వీలుగా, కంటైనర్ రవాణా కేంద్రాలుగా అభివృద్ధి  చేసుకోవాలి.

-- విభజన తరువాత ఉన్న అవశేష ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధారిత రాష్ట్రం కనుక రాబోయే పాలకులు, కాబోయే ముఖ్య మంత్రులు అత్యంత ప్రాధాన్యం వ్యవసాయ రంగానికివ్వాలి.

-- వృధాగా సముంద్రపాలు అవుతున్న గోదావరి నీటిని నిలువ చేసి, లక్షల ఎకరాలను సస్యశామలం చేస్తూ, కృష్ణా గోదావరి నదులను అనుసంధానించే పోలవరం బహుళార్ధ సాధక పధకాన్ని కేంద్ర నిధులతో వీలైనంత త్వరగా సాకారం చేసుకోవాలి.
-- రైతులందరికి కలగా మారిన పంట సాగుకు సకాలంలో నీరు, అందు బాటు ధరల్లో యూరియా ఇంకా ఇతర క్రిమి సంహారక మందులు, పండించిన పంటకు సరియైన ధర, దళారీ వ్యవస్థ నిర్మూలన నిజమవ్వాలి. వ్యవసాయం పైన ఆధార పడ్డవారంతా  గర్వ పడేలా చేయాలి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి.

--విశాఖపట్నం, గన్నవరం, తిరుపతి విమానాశ్రయాలను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలదన్నేలా నిర్మించాలి.

--ఇప్పటికే ఉన్న చిన్న విమానాశ్రయాల రన్ వే లను పెద్ద విమానాలు దిగేందుకు వీలుగా విస్తరించాలి. రాత్రి సమయంలో విమాన రాకపోకలకు అనుగుణంగా స్థాయి పెంచాలి.

--తీర పర్యాటక ప్రాంతాలకు, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు రోడ్డు, రైలు , వాయు రవాణా మార్గాలు మెరుగుపర్చాలి.

--ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ కోసం పోరాడాలి.

--సౌర శక్తి, పవన శక్తికి అధిక ప్రాధాన్యమిచ్చి రాష్ట్రాన్ని కాలుష్య కాసారంగా మార్చే బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రాలపైన ఆధారపడటం క్రమంగా తగ్గించుకోవాలి.

--ఐ.టి/ఐ.టి.యి.యస్ ఆధారిత పరిశ్రమల విసృతి కోసం అన్ని ద్వితీయ శ్రేణీ నగరాల్లో సైబర్ టవర్స్ (ఐ.టి వాణిజ్య కార్యకలాపాల భవన సముదాయం)ని నిర్మించాలి.

--హైదరాబాద్ కి కేంద్రం ప్రకటించిన  ఐ.టి.ఇన్వెస్ట్మెంట్ రీజీయన్(ఐ.టి.ఐ.ఆర్) ని విశాఖకు విస్తరించాలి. రాజకీయ నాయకులు ఈ హోదా కోసం పోరాడాలి.

--విభజన తరువాత ప్రముఖ విద్యాలయాల లోటుతో ఉన్న సీమాంధ్ర ప్రాంతం లో ఐ.ఐ.టి,ఐ.ఐ.ఎం,ఐ.ఐ.ఐ.టి,ఎన్.ఐ.టి,కేంద్రీయ విస్వ విద్యాలయాలు, వ్యవసాయ విద్యాలయాలు రానున్న ఐదేళ్ళలో ఏర్పాటుచేసుకోవాలి.






--విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి లను కలుపుతూ మెట్రో , విశాఖపట్నం లో మెట్రో రవాణా వ్యవస్థని అభివృద్ది చేసుకోవాలి.

--ప్రత్యేక హోదా పదేళ్ళ పాటు ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు తయారీ రంగ కేంద్రాలుగా భాసిల్లేలా చర్యలు తీసుకోవాలి.

--ప్రజా రవాణా వ్యవస్థలను సీమాంధ్రలోని అన్ని జిల్లా కేంద్రాలలో పటిష్టం చేయాలి. కొత్తగా నగరాల్లో నిర్మించబోయే బాహ్య వలయ రహదారులను (అవుటర్ రింగ్ రోడ్డు) , నాలుగు వరుసల రహదార్లు లేక రెండు వరుసల రహదార్లు క్రమ పద్దతిలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, పాద చారుల బాటలతో , ప్రత్యేక సైకిల్ ట్రాక్ లతో , రోడ్డుకి సమాంతరంగా రైల్ వ్యవస్థ ఎర్పాటు చేసుకోగలిగే సౌలభ్యంతో బహుళ ప్రయోజనకరంగా  నిర్మించుకోవాలి. 

--అన్ని జిల్లా కేంద్రాలలో బస్సుల ద్వారా త్వరిత రవాణా విధానాన్ని(బస్ ర్యాపిడ్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం -బి.ఆర్.టి.యస్ ) ని అమలు చేసే విధంగా రహదారులు విస్తరించాలి.

--కొత్తగా నిర్మించే ప్రభుత్వ కార్యాలయాలను హరిత భవనాలుగా (గ్రీన్ బిల్డింగ్స్) తీర్చిదిద్ది , ప్రైవేట్ సంస్థలు నిర్మించే హరిత భవనాలకు ప్రత్యేక రాయితీలివ్వాలి.

--ప్రభుత్వ పాలనా వ్యవహారాలు , వివిధ శాఖల కార్యకలాపాలన్నింటిని అంతర్జాలంలో(ఆన్లైన్) లో నిర్వహించేలా వెబ్ సైట్లు రూపొందించాలి. తద్వారా పరిపాలనలో పారదర్శకతకి(ట్రాన్స్పరెన్సీ) పెద్ద పీట 
వేసినట్లవుతుంది. 

--మారుమూల గ్రామాల్లో పల్లెలకు ప్రభుత్వ కార్యక్రమాలు,అభివృద్ది ఫలాలు చేరాలంటే పరిపాలనా సౌలభ్యం కోసం సీమాంధ్రలో ప్రస్తుతమున్న జిల్లాల సంఖ్యని 13 నుండి 25 కి పెంచాలి.

--కొత్త ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సుస్థిరత కోసం ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 175 నుంది 225 కి పెంచాలి.

--యువతలో వృత్తి నైపుణ్యాలను పెంచి, ఉద్యోగాలకు సిద్దం చేసేందుకు వివిధ పరిశ్రమల సహకారంతో సీమాంధ్ర విశ్వ విద్యాలయాల్లో ప్రత్యేక వృత్తి విద్యా కోర్సులను  ప్రారంభించాలి.

--కొత్త రాష్ట్రంలో సినీ పరిశ్రమను విస్తరించేందుకు సీమాంధ్రకు చెందిన సినీ ప్రముఖులతో చర్చించి సినీ పరిశ్రమాభివృద్దికి అవసరమైన ప్రోత్సహకాలు కల్పించాలి.

--సీమాంధ్ర వర్ధమాన క్రీడాకారులందరికి అత్యున్నతమైన క్రీడా ప్రమాణాలతో హైదరాబాద్ లోని క్రీడా ప్రాంగణాలకు సమాన స్థాయిలో సీమాంధ్ర ప్రాంతం లో స్టేడియాలు అభివృద్ది చేసుకోవాలి. విశాఖ , విజయవాడ క్రికెట్ స్టేడియాలలో వసతులు మెరుగుపర్చాలి. ప్రతి మండల కేంద్రంలో ఒక స్టేడియం నిర్మించాలి.

--ప్రస్తుతమున్న కేంద్ర పరిశోధన సంస్థల విస్తరణతో పాటు, వ్యవసాయ సంబంధిత ప్రత్తి, మిరప, పొగాకు, చెరకు, మామిడి, అరటి, ఆపరాలు మరియు మత్స్య రంగాలకు చెందిన కేంద్ర పరిశోధన సంస్థల స్థాపనకై నిరంతరం కృషి చేయాలి. 

--తీరప్రాంత పోలీస్ స్టేషన్లను(మెరైన్ పోలీస్ స్టేషన్) పటిష్టపరిచి భద్రతని కట్టు దిట్టం చేయాలి. సముద్రంలో వేటకోసం వెళ్ళే పడవలకు ఒక గుర్తిపు సంఖ్య ఇవ్వాలి. లైట్ హౌస్ టూరిజం ని వృద్ది చేయాలి.

-- విశాఖ-చెన్నై పారిశ్రామిక మండలి (ఇండస్ట్రియల్ కారిడార్) ని కేంద్రం పైన ఒత్తిడి పెంచి సాధించుకోవాలి.

-- బెంగళూరు-చెన్నై పారిశ్రామిక మండలిలో భాగమైన చిత్తూరు-నెల్లూరు జిల్లాలో ఎర్పాటుకాబోయే పరిశ్రమల నుండి ఎగుమతి దిగుమతులకు అనుకూలంగా క్రిష్ణ పట్నం పోర్ట్ కి, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి రోడ్డు, రైల్ రవాణా మార్గాలను మెరుగుపర్చాలి.

--సీమాంధ్రలో అధ్వాన్నంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సౌకర్యాలను, ప్రభుత్వ బడుల్లో ఉన్న మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపర్చాలి. 

--సమైక్య రాష్ట్రంలో అందని ద్రాక్ష గా మిగిలిన "పరిపాలనలో 100 శాతం తెలుగు వినియోగం" ని ప్రోత్సహించి తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషకి పునర్ వైభవం తీసుకురావాలి. తెలుగు భాషోద్ధరణకు కృషి చేసే రాష్ట్రం గా అంధ్రప్రదేశ్ మిగలాలి. 

--జలయజ్ఞం లో ప్రాభించిన వివిధ ప్రాజెక్టులను ఒక ప్రణాళికా పద్దతిలో ఏవైతే తక్కువ పెట్టుబడితో,తక్కువ సమయంలో పూర్తై ఎక్కువ లాభాన్ని సీమాంధ్ర రైతులకు కల్గిస్తాయో పరిశీలించి వాటినే మొదట పూర్తి చేయాలి.   

--గ్రామాల్లో చెరువులు త్రవ్వించి, ఇంకుడు గుంతలు నగరాల్లో నిర్మించి, చెక్ డ్యాములు పర్వత ప్రాంతాల్లో కట్టించి భూగర్భ జలవనరులను కాపాడుకోవాలి.  

--పులిచింతల ప్రాజెక్టులో భాగంగా ఇంకా పూర్తి కాని పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి కృష్ణా ఆయకట్టు రైతుల పైర్లకు రాబోయే రబీ నుండి సాగు నీరందించాలి.

--జవహర్ లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పధకం కింద వచ్చే నిధులతో ఎ.పి.యస్.ఆర్.టి.సి ని పటిష్టం చేయాలి. ఆర్.టి.సి ని ప్రభుత్వంలో విలీనం చేయాలి.

--చేనేత పరిశ్రమకి ప్రోత్సహకాలివ్వాలి. ధర్మవరాన్ని భారతదేశంలోనే ప్రఖ్యాత పట్టు చీరల తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసుకోవాలి.
-- హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గా పదేళ్ళు ప్రకటించినప్పటికీ కొత్తగా వచ్చే పార్టీ సీమాంధ్ర కార్యాలయాలతో సహా సీమాంధ్రకు అనుబంధమైన అన్ని సంస్థలు సీమాంధ్ర ప్రాంతంలోనే తమ కార్యాలయాలు నెలకొల్పి అక్కడ నుండే కార్యకలాపాలు నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

--సభలు, సమావేశాల నిర్వహణకు అనువుగా ఉండేందుకు అత్యాధునిక వసతులతో కూడిన కన్వెన్షన్ సెంటర్లను విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లలో నిర్మించాలి.

--ఆంధ్ర ప్రదేశ్ లో వై.యస్ హయాంలో కేంద్ర ప్రభుత్వం శంఖుస్థాపన చేసిన బి.హెచ్.ఇ.ఎల్-ఎన్.టి.పి.సి విద్యుత్ ఉపకరణాల తయారి పరిశ్రమ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ కర్మాగారాన్ని త్వరగా పూర్తి చేసేలా ఆ సంస్థలపైన ఒత్తిడి తేవాలి.  



                          ఒక జిల్లాను వైద్య రంగంలో అగ్రగామిగా( హెల్త్ క్యాపిటల్) , మరో జిల్లాను పరిపాలనా కేంద్రంగా (అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్) , ఇంకో జిల్లాను విద్యాలయాలకు నెలవుగా( ఎడ్యుకేషన్ సెంటర్), ఆర్ధిక వ్యాపార రాజధానిగా(ఫైనాన్షియల్ క్యాపిటల్) మరో జిల్లాను, రవాణా కూడలి (ట్రాన్స్పోర్టేషన్ హబ్ )గా ఇంకో జిల్లాను, హార్డ్ వేర్ మరియు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఒక చోట, వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు మరో చోట, ఫార్మా మరియు గ్యాస్ రంగాలు ఒక ప్రాంతంలో, సిమెంట్ మరియు ఖనిజ పరిశ్రమలు మరో ప్రాంతంలో , పాలు మరియు మత్స్య ఆధారిత పరిశ్రమలు ఇంకో ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేట్ పరిశోధనా కార్యాలయాలు వివిధ ప్రాంతాలలో ఇలా అభివృద్దిని పంచాలి. సమతులాభివృద్దిని సాధించాలి. సీమాంధ్ర సర్వతో ముఖాభివృద్దికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. కొత్త ఆంధ్రప్రదేశ్ ని భారత దేశంలోనే అగ్రగామిగా నిలపాలి.

  ఎవరో ప్రముఖ కవి అన్నట్లుగా..
                     అనుకున్నామని జరగవు అన్నీ,
                     అనుకోలేదని ఆగవు కొన్నీ,
                     జరిగేవన్ని మన మంచికని,
                     అనుకోవడమే మనిషి పని.

                      రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని రాజకీయ నాయకులు, రెండు ప్రాంతాల ప్రజలు గుర్తించాలి. తెలుగు ప్రజలకు మేలు జరిగే అన్ని సందర్భాలలో సమైక్యంగా ప్రాంతాలకతీతంగా వాణి వినిపించి తామంతా ఒక్కటే అని నిరూపించాలనేది నా చిన్న కోరిక.  

  

2 comments:

  1. 1. బెంగుళూరు, చెన్నై నగరాలకు దగ్గర ఉన్న జిల్లాలలో ఆయా నగరాల అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి కన్నడ/తమిళ భాషాప్రావీణ్యం పెంచాలి 2. కౌలుదారులకు పట్టాలు ఇవ్వాలి 3. సముద్రానికి దగ్గరలో ట్రాలర్లు నిషేదించాలి 4. మత్స్యసంపద దండిగా ఉన్న ప్రాంతాలలో కోల్డు స్తోరేజీలు పెట్టాలి 5. శ్రీపెరంబదూరుకు దగ్గరలో ఉన్న చిత్తూరులో ఆటో ఆన్సిల్లరీలకు ప్రోత్సాహం ఇవ్వాలి 6. విశాఖ, కొల్లేరు, పులికాట్ ప్రాంతాలలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి 7. మరుగునపడ్డ చేతివృత్తులకు & హస్తకళలకు చేయూతనివ్వాలి 8. ధర్మవరం & మంగళగిరి చీరలను దేశంలోనే అతి నాణ్యమయిన స్తాయికి తీసుకురావాలి 9. బందరు పోర్టుకు పునర్వైభవం రావాలి 10. అటవీసంపద ఆధారంగా పరిశ్రమలు రావాలి.

    ReplyDelete
  2. చాలా మంచి సూచనలు.

    ReplyDelete

India in Modi Rule 2014-24

Translate